పెరిగిన ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ ధరలు


కొవిడ్‌-19 ప్రభావంతో రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికుల గుంపును తగ్గించడానికి భారతీయ రైల్వే చేపట్టిన ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ధరల పెంపును ఈనెల 18వ తేదీ నుంచి వాల్తేర్‌ డివిజన్‌లో పలు చోట్ల అమలు చేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజనల్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌ పరిధిలో శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, రాయగడ, విశాఖ రైల్వేస్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు తెలిపారు. మిగిలిన స్టేషన్‌లలో పాతధరలు మాత్రమే ఉండనున్నట్లు తెలిపారు. వీటితో పాటు బోగీల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నామన్నారు. బోగీల హ్యేండిల్స్‌, టాయిలెట్ల డోర్‌ హ్యేండిళ్లు.. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన క్రిమిసంహారక మందులతో పరిశుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు కొవిడ్‌-19ని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.