రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నామని, నెలాఖరు వరకు సెలవులు ప్రకటించామని ట్రిపుల్ ఐటీ సంచాలకులు డా. జి.భానుకిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశివానిలో ఉన్న బాలుర క్యాంపస్, షేర్మహ్మద్పురం పంచాయతీ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో బాలికల క్యాంపస్లోని పిల్లలను ఆర్టీసీ బస్సుల్లో వారి జిల్లాలకు పంపించినట్లు చెప్పారు. ప్రభుత్వమే ప్రయాణ ఛార్జీలు భరించి పంపిస్తున్నట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నాటికి విద్యార్థులందరిని పంపించినట్లు తెలిపారు.
జిల్లాలో కరోనో వైరస్ వ్యాప్తి ప్రభావం బ్యాంకులు, తపాలా కార్యాలయాలపై స్వల్పంగా కనిపిస్తోంది. అన్నింటిలోనూ ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. అయితే బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు వచ్చే జనం గతం కంటే గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అధికారికంగా కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమీ కనిపించడం లేదు. పరి శుభత్ర, ప్రత్యేక చర్యలు, శానిటైజర్ పంపిణీ వంటి చర్యలు కనిపించడంలేదు.
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీన మహాసౌర హోమం, అరుణ హోమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో సూర్యప్రకాష్ చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలకుండా ఆలయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.