సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. శుక్రవారం ముంబయిలోని ఆర్బీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.
‘‘ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఖరీఫ్లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3శాతం పెరిగాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్ వినియోం బాగా తగ్గింది. భారత్ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్ అంచనావేసింది. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి. 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి. జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం. లాక్డౌన్ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశాం. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఎటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉంది. లాక్డౌన్ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం’’ అని శక్తికాంత దాస్ వివరించారు.