ముగ్గురు ఎక్సైజ్‌ అధికారులకు బదిలీ తాఖీదులు

పరిపాలనాపరమైన కారణాలతో నగరంలోని ముగ్గురు ఎక్సైజ్‌ అధికారులను వెంటనే కమిషనరేట్‌కు పంపాలని రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయి. పెందుర్తి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని గణేశ్‌ బార్‌లో జరిగిన ఉదంతం నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గాజువాక ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పెందుర్తి ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీ చేసినప్పుడు మద్యం నిల్వల్లో లోపాలను గుర్తించలేదు. బుధవారం నగర పోలీస్‌ టాస్క్‌ఫోర్సు బృందం దాడి చేసి బార్‌ భవనంలోని వేరే గదుల్లో దాచిన 351 మద్యం సీసాలను గుర్తించింది. వీటిని సిబ్బంది అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పెందుర్తి ఎక్సైజ్‌ సి.ఐ. మురళి, గాజువాక ఎక్సైజ్‌ ఇ.ఎస్‌. టాస్క్‌ఫోర్స్‌ సీఐ దొర, గాజువాక ఇ.ఎస్‌.టాస్క్‌ఫోర్స్‌ ఎ.ఇ.ఎస్‌. ఆర్‌.ప్రసాద్‌లను వారి పోస్టుల నుంచి తొలగించి కమిషనరేట్‌ కార్యాలయానికి రావాలని తాఖీదులు ఇచ్చినట్లు సమాచారం.