దేశవ్యాప్తంగా హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో లాక్డౌన్ మినహాయింపులు నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మరో లేఖ రాశారు. ఈ నెల 15న జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లాక్డౌన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.
దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలని ఆదేశించిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని హెచ్చరించింది.
నేటి నుంచి రెస్టారెంట్లకు, బస్సు సర్వీసులకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అత్యవసరం కాని సేవలకు అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.