అధికార యంత్రాంగం కాస్త ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో రెండు వారాల తరువాత జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. షీలానగర్ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్లో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. తమిళనాడు నుంచి మతప్రచారానికి 10 మంది మహిళల బృందం గత నెలలో నర్సీపట్నానికి వచ్చింది. వారిలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిద్దరూ ఆదివారం డిశ్చార్జ్ అవ్వగా.. గతంలో వారితో సన్నిహితంగా మెలిగిన మహిళకు తాజాగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో కరోనో కేసుల సంఖ్య 21కి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి విశాఖలో తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొంత మంది మతప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి గత నెల 13న ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో విశాఖకు వచ్చారు.
వారు నగరంలోనే కాకుండా నర్సీపట్నంలో మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇంతలో వారికి కరోనా లక్షణాలు ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వారిని ప్రభుత్వ ఛాతి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారౖణెంది. దీంతో ఆ ఇద్దరి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారితో ప్రార్థనల్లో పాల్గొన్న, సన్నిహితంగా మెలిగిన వారిని అధికారులు గుర్తించి క్వారంటైన్లో ఉంచారు. ఇందులో షీలానగర్ ప్రాంతంలో ఒక కళాశాలలో క్వారంటైన్ సెంటర్లో ఉంటున్న మహిళకు కరోనా లక్షణాలు బయటపడడంతో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో గీతం ఆస్పత్రికి తరలించారు.
దాదాపు రెండు వారాల తర్వాత విశాఖలో మరో కేసు బయటపడటంతో జీవీఎంసీ అధికారులు, వైద్యులు షీలానగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని స్ప్రేయింగ్తో పాటు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదవగా ఆదివారం ఇద్దరు డిశ్చార్జ్ అయినవారితో కలిపి మొత్తం 18 మందికి కరోనా నయమైంది. తాజాగా డిశ్చార్జ్ అయిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడంతో లాక్డౌన్ కారణంగా ప్రసుత్తం వారిని అక్కడకు పంపించే అవకాశం లేకపోవడంతో గీతం ఆస్పత్రిలోనే వేరే చోట కార్వంటైన్లో ఉంచారు. ప్రస్తుతం గీతం ఆస్పత్రిలో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. షీలానగర్ క్వారంటైన్లో 60 మంది కరోనా అనుమానితులు ఉన్నారు.